ఇళ్ల స్థలాల పంపిణీకి భూ పరిశీలన

ABN , First Publish Date - 2021-09-03T06:40:47+05:30 IST

రెండో విడత ఇళ్లస్థలాల మంజూరు ప్రక్రియలో భాగంగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ 90 రోజుల్లోగా ఇళ్లపట్టాలు మంజూరు చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి తెలిపారు.

ఇళ్ల స్థలాల పంపిణీకి భూ పరిశీలన

ఉంగుటూరు, సెప్టెంబరు 2 : రెండో విడత ఇళ్లస్థలాల మంజూరు ప్రక్రియలో భాగంగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులందరికీ 90 రోజుల్లోగా ఇళ్లపట్టాలు మంజూరు చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు నూజివీడు ఆర్డీవో కె.రాజ్యలక్ష్మి తెలిపారు. మండలంలో గురువారం ఆమె పర్యటించారు. ఇళ్ల స్థలాలకోసం ఉంగుటూరు, ఇందుపల్లి, ఎలుకపాడు, గ్రామాల్లో రైతుల నుంచి సేకరించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లస్థలాలులేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందన్నారు. ప్రస్తుతం ఉంగుటూరులో 6.40 ఎకరాల్లో 198 మంది లబ్ధిదారులకు ఇందుపల్లిలో 1.55 ఎకరాల్లో 80 మంది లబ్ధిదారులకు ఎలుకపాడులో 1.86 ఎకరాల్లో 61 మంది లబ్ధిదారులకు వెరసి 9.81 ఎకరాల్లో 339 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శాశ్వత భూహక్కు-భూరక్షా పథకం కింద దిబ్బనపూడిలో క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియను ఆర్డీవో పరిశీలించారు. అనంతరం ఇందుపల్లి, ఆముదాలపల్లి గ్రామ సచివాలయాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరాతీశారు. అర్హులందరికీ ప్రభుత్వపథకాలు అందించాలని, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీలత, ఆర్‌ఐ కె.ఽథామస్‌కుమార్‌, సర్వేయర్‌ సీహెచ్‌ వల్లీపుష్ప, పంచాయతీ కార్యదర్శి నర్రా ప్రసాద్‌, సర్పంచ్‌లు కాటూరి వరప్రసాద్‌, బండి వెంకటలక్ష్మి, పొలిమెట్ల శ్రీరామ్‌, వీఆర్వోలు రామ్మోహనరావు, వినోద్‌  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-03T06:40:47+05:30 IST