లారీ క్లీనర్ మృత్యువాత
ABN , First Publish Date - 2021-12-15T06:12:57+05:30 IST
జాతీయ రహదారిపై ఉప్పలంక వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో లారీ క్లీనర్ మృత్యువాతపడ్డాడు. కరప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
కరప, డిసెంబరు 14: జాతీయ రహదారిపై ఉప్పలంక వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో లారీ క్లీనర్ మృత్యువాతపడ్డాడు. కరప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న రైస్మిల్లుకు బియ్యం లోడుతో ఒక లారీ వచ్చి జాతీయ రహదారి పక్కన ఆగింది. విజయవాడ సమీపంలోని మాచవరానికి చెందిన లారీ క్లీనర్ సంకూరి శ్రావణ్లాల్ (32) సీరియల్ నెంబరు కోసం లారీ దిగి రైస్మిల్లులోకి వెళ్లాడు. తిరిగి వచ్చి లారీలో కూర్చుని డ్రైవర్తో మాట్లాడుతుండగా గ్రావెల్ లోడుతో కోరంగి వైపు అతివేగంగా వస్త్తున్న టిప్పర్ను చూసి భయంతో లారీ ముందుకు వెళ్లి నిలుచున్నాడు. టిప్పర్ వాయువేగంతో వచ్చి లారీని ఢీకొట్టి గెంటుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి లారీ ముందు దాక్కున్న శ్రావణ్లాల్ను లారీ తొక్కుకుంటూ పోయింది. లారీ చక్రాల కింద పడి నలిగిపోయిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద స్థలంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కరప పోలీసులు టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరప ఏఎస్ఐ వి.సూరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.