విస్తరణకు నోచని బస్టాండ్
ABN , First Publish Date - 2020-12-20T04:47:26+05:30 IST
విస్తరణకు నోచని బస్టాండ్
- కనీస సదుపాయాలు కరువు
- ప్రతిపాదనలకే పరిమితమైన క్యాంటీన్, పార్కింగ్
- ప్రయాణికుల ఇబ్బందులు.. పట్టించుకోని అధికారులు
ఆమనగల్లు : ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్ దశాబ్దాలుగా విస్తరణకు నోచుకోవడం లేదు. బస్టాండ్లో కనీస వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దుకాణాలు, డబ్బాల ఏర్పాటుతో బస్టాండ్ వ్యాపార సముదాయంగా మారి ఇరుకుగా తయారైంది. 2003లో జాతీయ రహదారిని అనుసరించి ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. 17 ఏళ్లు గడిచినా పెద్దగా సదుపాయాలు ఒనగూడలేదు. బస్టాండ్లో ప్రయాణికులకు తాగునీటి వసతి లేదు. వాసవీ క్లబ్ నిర్మించిన మినీ ట్యాంక్ కుళాయి కనెక్షన్ తొలగించడంతో నిరూపయోగంగా మారింది. ప్రయాణికులు విధిలేక బాటిళ్లు కొనుక్కొని దాహం తీర్చుకుంటున్నారు. క్యాంటీన్ లేక ప్రధాన రహదారిపై గల హోటళ్లకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో కొందరు ప్రయాణికులు బస్టాండ్లో ఉంచిన వస్తువులు పోగొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. బస్టాండ్ ముందు భాగంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్లో ఓ భాగంలో సీసీ నిర్మాణానికి కూడా నోచుకోలేదు. ప్లాట్ఫారాలు తగినన్ని లేక ఏ బస్సు ఎక్కడకు వెళ్తుందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలూ లేవు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ను విస్తరించి సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.