రోడ్డెక్కారు!
ABN , First Publish Date - 2020-03-24T07:42:58+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ప్రకటనను ప్రజలు బేఖాతర్ చేశారు. జిల్లాలో జనాలు యథేచ్ఛగా...
- లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన
- యథేచ్ఛగా తిరిగిన ఆటోలు, ప్రైవేట్ వాహనాలు
- మధ్యాహ్నం తర్వాత పోలీసుల చర్యలతో తగ్గిన వాహన రద్దీ
- పాలు, కూరగాయల కోసం గుమిగూడిన జనం
- శంషాబాద్ ఎయిర్పోర్టులో కనిపించిన ప్రయాణికులు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ ప్రకటనను ప్రజలు బేఖాతర్ చేశారు. జిల్లాలో జనాలు యథేచ్ఛగా రోడ్లపై సంచరించారు. ప్రభుత్వ చర్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు. గుంపులు గుంపులుగా తిరిగారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఒకరిద్దరి కంటే ఎక్కువగా తిరగొద్దని, ప్రజలు ఒకేచోట గుమికూడ్దొని ప్రభుత్వం, వైద్యులు హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదు. పాటించాల్సిన జాగ్రత్తలను గాలికొదిలేశారు. పాలు, కూరగాయలు, కిరాణా దుకాణాల వద్ద భారీగా గుమికూడారు. సామాజిక దూరం పాటించాలని ఓ వైపు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. ఫలితం లేకుండా పోతుంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం ఒక్క రోజు మాత్రం ప్రజలు స్వీయ నిర్బంధాన్ని పాటించారు. రెండోరోజు సోమవారం లాక్డౌన్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆటోలు, ప్రైవేట్ బస్సులు రోడ్లపై తిరిగాయి. జనతా కర్ఫ్యూతో ఆదివారం బోసిపోయిన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. సోమవారం ప్రయాణికులు కనిపించారు.
కొన్ని దేశీయ విమాన సర్వీసులు కొనసాగటంతో ఇక్కడ నుంచి వివిధ రాష్ర్టాలకు తరలివెళ్లారు. ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరిశీలించారు. వందకు పైగా శరీర ఉష్ణోగ్రత ఉంటే.. విమానాశ్రయంలోని అపోలలో పరీక్షలు నిర్వహించారు. హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తూ తూర్పుగోదావరికి చెందిన నలుగురు వ్యక్తులు చేతికి వేసిన స్టాంప్ను తుడుపుకొని పారిపోయేందుకు యత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక వాహనంలో వారి రాష్ర్టాలకు తరలించారు. షాద్నగర్లో ఉదయం లాక్డౌన్ను ఉల్లంఘించారు. విచ్చలవిడిగా వాహనాలు రోడ్డుపై తిరిగాయి. మధ్యాహ్నం పోలీసుల చర్యలతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కరోనా అనుమానితుడి ఇంటికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్టిక్కర్ అతికించారు. చేవెళ్లలో కూడా మధ్యాహ్నం వరకు జనాలు రోడ్లపై సంచరించారు.
పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా తగ్గాయి. సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి కరోనాపై అవగాహన కల్పించారు. రోడ్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లారు. బ్యాంకు సేవలను అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ గేట్ వద్ద మైక్ ఏర్పాటు చేసి కరోనా వైర్సపై ప్రచారం చేశారు. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు ప్రాంతాల్లో ప్రభుత్వ చర్యలను ఉల్లంఘించారు. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వాహనాలు రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని చెప్పడంతో తిరిగి ఇంటి బాటపట్టారు. ఉదయం ఉన్న పరిస్థితి మధ్యాహ్న కనిపించలేదు.