తరుగు పేరిట దోపిడీ!
ABN , First Publish Date - 2020-11-21T05:57:58+05:30 IST
అకాల వర్షాలతో సగం పంట నష్టపోయి, మిగిలిన కొద్ది పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లిన రైతులను నిర్వాహకులు, హమాలీలు దోచుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలు, నిర్వాహకుల కుమ్మక్కు
రైతుల నుంచే హమాలీలకు కూలి
అమలుకు నోచుకోని 72 గంటల్లో చెల్లింపులు
ఇబ్బందులు పడుతున్న రైతులు
సంగారెడ్డి టౌన్, నవంబరు 20: అకాల వర్షాలతో సగం పంట నష్టపోయి, మిగిలిన కొద్ది పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లిన రైతులను నిర్వాహకులు, హమాలీలు దోచుకుంటున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు, హమాలీల తరుగు పేరిట ధాన్యం బస్తాల్లో కోత విధిస్తున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది తలనొప్పిగా మారింది. నిబంధనల ప్రకారం బస్తాకు కిలో చొప్పున తరుగు తీయాలి. అయితే కేంద్రాల వద్ద హమాలీలు, కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై బస్తాకు రెండు నుంచి మూడు కిలోల చొప్పున తరుగు తీస్తున్నట్టు తెలిసింది. ఇటీవల జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తాలు కింద బస్తాకు కిలో చొప్పున మాత్రమే తీసుకోవాలని సూచించారు. అయినా కూడా అక్కడ రెండు, మూడు కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హమాలీలకు గతంలో క్వింటాల్కు ప్రభుత్వం రూ.5 చొప్పున చెల్లించేది. దీంతో పాటు రైతుల వద్ద అదనంగా మరో రూ.15 నుంచి 20 వరకు వసూలు చేసుకునే వారు. ప్రస్తుతం ప్రభుత్వం హమాలీలకు కూలీ ఇవ్వడం లేదు. ఫలితంగా రైతుల నుంచే క్వింటాలుకు రూ.30-35 వరకు హమాలీలు వసూలు చేస్తున్నారు.
వసతులు శూన్యం
జిల్లాలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పించలేదు. మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, మూత్రశాలలు, టెంట్లను ఏర్పాటు చేయాలి. వాటిని ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ధాన్యం అమ్మకం పూర్తయిన 72 గంటల్లోగా డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా వారం రోజులు గడుస్తున్నా చెల్లించడం లేదు.
ముమ్మరంగా ధాన్యం కొనుగోలు
జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉండగా ధాన్యాన్ని సేకరించేందుకు మొత్తం 127 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ద్వారా 59, ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ద్వారా 68 కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 6,554 మంది రైతుల నుంచి 29,643 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఏసీఎస్ పరిధిలోని 59 కేంద్రాల్లో 15,676 మెట్రిక్ టన్నులు, ఐకేపీ పరిధిలోని 68 కేంద్రాల్లో 13,966 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 28,471 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. మొత్తం రూ.55.97 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని సేకరించగా, 4,821 మంది రైతులకు రూ.41.95 కోట్లు విడుదలైనట్లు తెలిసింది. మిగిలిన 1,733 మంది రైతులకు రూ.14.02 కోట్లు విడుదల కావల్సి ఉందని సివిల్ సప్లయ్ అధికారుల ద్వారా తెలిసింది.