చైనా నష్టం 40: అదంతా ఫేక్.. మీడియాలో వార్తలపై చైనా రియాక్షన్!
ABN , First Publish Date - 2020-06-24T00:47:03+05:30 IST
గాల్వాన్ ఘర్షణలో గాయపడిన, మృతిచెందిన చైనికుల సంఖ్య 40 వరకూ ఉంటుందున్న వార్తలను చైనా ఖండించింది.
బీజింగ్: గాల్వాన్ ఘర్షణలో గాయపడిన, మృతిచెందిన చైనా సైనికుల సంఖ్య 40 వరకూ ఉంటుందున్న వార్తలను చైనా ఖండించింది. అదంతా ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం ఓ ప్రకటన చేశారు.
‘ఇక మీడియాలో వస్తున్న వార్తల గురించి మాట్లాడుకుంటే..గాయపడిన, మరిణించిన చైనా సైనికులు 40 వరకూ ఉంటారని కొందరు అంటున్నారు. అయితే నేను కచ్చితంగా చెబుతున్నది ఒకటే..అదంగా ఫేక్ వార్తలు’ అని జావ్ లిజియన్ స్పష్టం చేశారు.
సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు చల్లార్చేందుకు భారత్ చైనా ఉన్నతాధికారులు సమావేశమయ్యారని ఆయన తెలిపారు. ‘భారత్ చైనాలు ప్రస్తుతం చర్చల్లో ఉన్నాయి. మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు జరపుతున్నాయి’ అని ఆయన అన్నారు.
కాగా.. గాల్వాన్ ఘర్షణల్లో భారత్ చైనా దేశాలకు జరిగిన నష్టం గురించి కేంద్ర మంత్రి వీకే సింగ్ పలు విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్ 20 మంది సైనికులు కోల్పోగా..గాయపడిన, మృతి చెందిన చైనా సైనికుల సంఖ్య ఇంతకు రెట్టింపని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే చైనా నష్టంపై తనకు వద్ద ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదని ఇంతవరకూ చెబుతూ వచ్చిన విదేశాంగ ప్రతినిధి.. తాజాగా ఈ వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా.. లద్దాఖ్ ఉద్రిక్తతలకు ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా మిలటరీ అధికారుల చర్చల్లో.. సైనికులను వెనక్కు పిలిపించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే.