పాదాలు పగలకుండా...
ABN , First Publish Date - 2020-12-07T17:23:16+05:30 IST
శీతకాలంలో పాదాల పగుళ్లు చాలామందిలో ఎదురయ్యే సమస్య. దీనివల్ల నొప్పిగా ఉండడం, నడవడం ఇబ్బంది కావడమే కాదు... పాదాలు అందవికారంగా కూడా కనిపిస్తాయి. వాతావరణం కారణంగా
ఆంధ్రజ్యోతి(07-12-2020)
శీతకాలంలో పాదాల పగుళ్లు చాలామందిలో ఎదురయ్యే సమస్య. దీనివల్ల నొప్పిగా ఉండడం, నడవడం ఇబ్బంది కావడమే కాదు... పాదాలు అందవికారంగా కూడా కనిపిస్తాయి. వాతావరణం కారణంగా ఈ సీజన్లో కాళ్ళు పొడిబారుతాయి. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మడమల దగ్గర చర్మానికి పగుళ్ళు వస్తాయి. పాదాలను సరిగ్గా శుభ్రపరుచుకోకపోవడం, వాతావరణంలోని కాలుష్యం, మధుమేహం, సొరియాసిస్, థైరాయిడ్, చర్మ సంబంధమైన సమస్యల వల్ల పాదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి. మొదట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. అవేమిటంటే...
పాదాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పొడిబారిన పాదాలపై దుమ్ము పేరుకుపోతే పగుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పగుళ్ళలోకి దుమ్ము వెళితే ఇన్ఫెక్షన్లు రావచ్చు. కాబట్టి పాదాలను తరచూ శుభ్రం చేసుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలి. సాక్సులు వేసుకుంటే మరింత రక్షణ ఉంటుంది.
నూనె చక్కటి మాయిశ్చరైజర్. పాదాలకు నూనె రాసుకొని, కాసేపు ఉంచాక కడుక్కుంటే, చర్మం పొడిబారకుండా నిరోధించవచ్చు. పగుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే నూనెతో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
తులసి ఆకులు, వేపాకులను ఫంగస్, బ్యాక్టీరియా నివారిణులుగా పనిచేస్తాయి. వాటిని నూరి ముద్ద చేసి, కాస్త పసుపును కలిపి పాదాలకు రాసుకుంటే... పాదాలూ, మడమలూ మృదువుగా మారుతాయి. అంతేకాదు, పాదాలకు పగుళ్ళు పడి, వాటి నుంచి రక్తం వస్తున్నప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తే త్వరగా నయం అవుతుంది.
గ్లిజరిన్లో రోజ్వాటర్ కలిపి పాదాలకు రాస్తే పగుళ్ళు తగ్గుతాయి. నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని రాసి, రాత్రంతా అలా ఉంచేస్తే మంచిది. పగుళ్ళు తగ్గిన తరువాత మళ్ళీ ఆ సమస్య తలెత్తకుండా ఉండాలంటే గ్లిజరిన్-రోజ్వాటర్ మిశ్రమాన్ని రాస్తూ ఉండాలి.