భవన నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-11-22T04:50:22+05:30 IST
కోర్టు భవన సముదాయాన్ని నాణ్యతగా నిర్మించాలని... లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి సూచించారు. కురుపాంలో రూ.3.87 కోట్లతో నిర్మిస్తున్న కోర్టు భవన సముదాయాన్ని ఆయన శనివారం పరిశీలించారు. వచ్చే నెలలో భవనాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి భవనాలను ఆకస్మికంగా పరిశీలించారు.
జిల్లా జడ్జి గోపి
కురుపాం, నవంబరు 21: కోర్టు భవన సముదాయాన్ని నాణ్యతగా నిర్మించాలని... లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి సూచించారు. కురుపాంలో రూ.3.87 కోట్లతో నిర్మిస్తున్న కోర్టు భవన సముదాయాన్ని ఆయన శనివారం పరిశీలించారు. వచ్చే నెలలో భవనాల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి భవనాలను ఆకస్మికంగా పరిశీలించారు. కోర్టు హాలు, బార్, ఏపీపీ గది, లైబ్రరీ, కక్షిదారుల వెయిటింగ్ హాలు, మహిళా న్యాయవాదుల గదిని పరిశీలించారు. ఆర్అండ్బీ అధికారులకు వివిధ సూచనలు ఇచ్చారు. మళ్లీ 15 రోజుల్లో ఇక్కడకు వస్తానని.. అప్పటికి అన్నీ పనులూ పూర్తి కావాలని స్పష్టం చేశారు. నాణ్యతలో లోపాలుంటే సహించేది లేదన్నారు. అనంతరం న్యాయమూర్తి నివాస గృహాన్ని సందర్శించారు. కోర్టు భవన సముదాయానికి అనుసరించి ఉన్న స్థలం విషయమై స్థానిక న్యాయమూర్తి యం.విజయరామేశ్వరిని అడిగారు. అది కల్యాణ మండపం కోసం కేటాయించిన స్థలమని ఆమె వివరించారు. కోర్టు ప్రాంగణంలో కల్యాణ మండపం ఉండకూడదని... ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటానని న్యాయమూర్తి గోపి విలేకర్లకు తెలిపారు. కురుపాం కోర్టు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందనుందని, భవిష్యత్ అవసరాల కోసం ఇంకొంత స్థలం అవసరమని చెప్పారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ అధికారులు నాగమోహన్, ప్రణయ, నిర్మల, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.