5.4 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-16T05:19:57+05:30 IST
స్థానిక ఎన్టీఆర్ జంక్షన్ వద్ద రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 5.4 టన్నుల రేషన్ బియ్యాన్ని మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
ఇద్దరి అరెస్టు, రెండు వాహనాల సీజ్
సబ్బవరం, డిసెంబరు 15 : స్థానిక ఎన్టీఆర్ జంక్షన్ వద్ద రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 5.4 టన్నుల రేషన్ బియ్యాన్ని మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. విజిలెన్స్ సీఐ జి.కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గాజువాక నుంచి చోడవరానికి రెండు వాహనాల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ బియ్యాన్ని పెందుర్తి మండల స్థాయి స్టాక్ పాయింట్కు తరలించారు. వాహనాలను సీజ్ చేసి, బియ్యం తరలిస్తున్న జోషి ఈశ్వరప్రసాద్(26), ఆడారి హరీశ్(20)లను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పట్టుబడ్డ బియ్యం విలువ రూ.1.62 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఎస్డీటి ఆకుల సులోచనరాణి, ఆర్ఐ రమణ, వీఆర్వో రుక్మిణి పాల్గొన్నారు.