స్వర్ణ ప్యాలెస్ ఘటనలో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే నజరానా
ABN , First Publish Date - 2020-08-20T23:06:33+05:30 IST
విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్ కేసులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే.
విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్ కేసులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేయగా.. పలువుర్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా నోటీసుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా విజయవాడ సీపీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని కూడా సీపీ నజరానా ప్రకటించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అయితే.. విచారణకు ముద్దాయిలు, అనుమానితులు ఎవరూ సహకరించడం లేదని తెలిపారు. ఆస్పత్రి బోర్డు సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చామని సీపీ తెలిపారు. కాగా.. ఇప్పటికే డాక్టర్ మమతకు నోటీసులివ్వడంతో పాటు 6గంటలకు పైగా విచారించారు. అనంతరం రాయపాటి శైలజకు కూడా నోటీసులు ఇచ్చారు.
విగ్రహాలు పెట్టొద్దు..
ఇదిలా ఉంటే.. వినాయచవితి గురించి మాట్లాడిన సీపీ.. కరోనా కారణంగా బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టొద్దని తెలిపారు. ఇళ్లలోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఊరేగింపులు, నిమజ్జనాలను అనుమతి లేదని సీపీ హెచ్చరించారు. ఆలయాల్లో నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని సీపీ సూచించారు.