ఇంద్రకీలాద్రిపై కార్తీక సందడి

ABN , First Publish Date - 2020-12-06T06:02:28+05:30 IST

కార్తీకమాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి కొనసాగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు, కళాకారుల నృత్య, గాన, నాద నీరాజ నాలతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని సేవిస్తున్నారు.

ఇంద్రకీలాద్రిపై కార్తీక సందడి

విజయవాడ-ఆంధ్రజ్యోతి : కార్తీకమాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి కొనసాగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు, కళాకారుల నృత్య, గాన, నాద నీరాజ నాలతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిని సేవిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. శనివారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపిన వేదపండితులు నిత్యార్చనలు, నివేదనలు సమర్పించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవావరణార్చన, చండీహోమం, శాంతి కల్యాణం తదితర ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మల్లేశ్వరాలయం వద్ద వేదపండితులు స్వామికి సహస్ర లింగార్చన, అభిషేకాలు, కాఠక పారాయణ నిర్వహించారు. సాయంత్రం ప్రదోష కాలంలో అమ్మవారికి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు సప్పా శివకుమార్‌ ఆధ్వర్యంలో చిన్నారులు ఎం.విజయహాసిని, హావిష చౌదరి, గీత, రేష్మిక, మౌనిక, శ్వేత, ప్రియవర్షిణి, హేమ, తేజస్వినితో కూడిన శిష్య బృందం ప్రధానాలయం ముందు కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేసి అమ్మవారికి నృత్యనీరాజనాలు సమర్పించారు. పప్పు సదాశివశాస్త్రి గాన నీరాజనం సమర్పించారు. దేవస్థానం కళాకారులు నాద నీరాజనాలు అందించారు. అనంతరం ఊంజల్‌ సేవ నిర్వహించారు. భక్తులు దీపాలను వెలిగించి దీపారాధన చేశారు. ఏపీఐఐసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజా, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2020-12-06T06:02:28+05:30 IST