గల్ఫ్లో బీజేపీ అభిమానుల ప్రచారం
ABN , Publish Date - May 06 , 2024 | 06:06 AM
తెలంగాణ ప్రవాసీలు పెద్ద సంఖ్యలో ఉన్న గల్ఫ్ దేశాల్లో బీజేపీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. దుబాయ్, షార్జా, అబూధాబీ, మస్కట్, రియాధ్, కువైట్ నగరాల్లో సాయంకాలం ప్రవాసీలను కలుస్తున్నారు. బీజేపీకి ఓటు వేయాలని స్వదేశంలోని కుటుంబ సభ్యులకు చెప్పాలని కోరుతున్నారు.
తెలంగాణ, ఏపీలో ప్రవాసీ కుటుంబాలు కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
తెలంగాణ ప్రవాసీలు పెద్ద సంఖ్యలో ఉన్న గల్ఫ్ దేశాల్లో బీజేపీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. దుబాయ్, షార్జా, అబూధాబీ, మస్కట్, రియాధ్, కువైట్ నగరాల్లో సాయంకాలం ప్రవాసీలను కలుస్తున్నారు. బీజేపీకి ఓటు వేయాలని స్వదేశంలోని కుటుంబ సభ్యులకు చెప్పాలని కోరుతున్నారు. దుబాయ్ ఎమిరేట్స్లోని తెలంగాణ ప్రవాసీల్లో సింహభాగం ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన వారున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్లకు ఇక్కడి ప్రవాసీ యువతలో చాలా మంది అభిమానులు ఉన్నారు. అర్వింద్ తరచూ దుబాయ్ పర్యటనలకు వస్తూ వీలైనంత ఎక్కువ మంది యువకులతో సమావేశాలు జరుపుతుండటం పార్టీకి సానుకూల అంశం. ఒక్క ఉత్తర తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రవాసీలను కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నామని బీజేపీ అనుబంధ ప్రవాసీ సంఘమైన ఇండియన్ పీపుల్స్ ఫోరం యూఏఈ అధ్యక్షుడు కుంభాల మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన వారు కువైట్లో భారీ సంఖ్యలో ఉన్నారు. రాజంపేట నుండి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మంగఫ్ ప్రాంతంలోని అనేక చోట్ల బీజేపీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు.